సాక్షి, ముంబయి : భారత ఐటీ పరిశ్రమ ఏ ఒక్కరి ఉద్యోగాలను లాగేసుకోవడం లేదని నాస్కామ్కు నేతృత్వం వహిస్తున్న తొలి మహిళ దేవజని ఘోష్ అన్నారు. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం భారత ఐటీ పరిశ్రమపై ఉన్న అపోహలను తొలగించడమే తన ముందున్నకర్తవ్యమని చెప్పారు. కృత్రిమ మేథ వంటి నూతన టెక్నాలజీలకు కంపెనీలను సిద్ధం చేసేలా నైపుణ్య కార్యక్రమాలకు పరిశ్రమ పెద్దలతో కలిసి కార్యాచరణ రూపొందిస్తామన్నారు.
దేశీయ మార్కెట్లో సేవలందిచేందుకు పలు కంపెనీలకు ఎదురవుతున్న అవరోధాలను తాము తొలగిస్తామన్నారు. కృత్రిమ మేథ వంటి నూతన టెక్నాలజీలను అందిపుచ్చుకునేందకు తొలుత దేశంలో ప్రొడక్ట్ డెవలప్మెంట్ను ప్రోత్సహించడమే సరైన మార్గమని చెప్పారు. విద్యార్థులు వాణిజ్యవేత్తలుగా ఎదిగేలా విద్యావ్యవస్థలోనే బీజం పడేలా మార్పులు అవసరమన్నారు. దేశంలో నూతన ఉద్యోగాల రూపకల్పనపై నాస్కామ్ దృష్టిసారిస్తుందన్నారు. గతంలోనూ నూతన టెక్నాలజీల కారణంగా కొందరు ఉద్యోగాలు కోల్పోయినా, అదే సమయంలో కొత్త ఉద్యోగాలూ అందుబాటులోకి వచ్చాయన్నారు. కృత్రిమ మేథ, రోబోటిక్స్,డేటా అనలిటిక్స్ వంటి నూతన టెక్న్నాలజీల ద్వారా కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయన్నారు.